ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇటీవలే టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ప్రతిస్పందిస్తూ, సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీ మరియు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి శనివారం ఆమె లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యే విషయంలో ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకుంది.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని, డిసెంబర్ 6, మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి ఆమె తెలిపారు. డిసెంబర్ 11, 12, 14, 15వ తేదీల్లో ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత తెలిపారు. ఈ మేరకు సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వష్టకు సోమవారం ఎమ్మెల్సీ కవిత ఓ లేఖ రాశారు.
“ఎఫ్ఐఆర్ కాపీ మరియు ఫిర్యాదు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని మీరు పేర్కొన్న మీ ఈ-మెయిల్ను నేను స్వీకరించాను. ఎఫ్ఐఆర్లోని విషయాలు, నిందితుల జాబితాతో పాటు 2022, జూలై 22 నాటి ఫిర్యాదులోని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాను. నా పేరు ఏ విధంగానూ కనిపించలేదని నేను రికార్డులో ఉంచాలనుకుంటున్నాను. మీరు ప్రతిపాదించినట్లుగా, నా ముందస్తు షెడ్యూల్ కారణంగా 2022, డిసెంబర్ 6న విచారణకు హాజరయ్యే స్థితిలో లేను. నేను ఈ నెల 11, 12 లేదా 14, 15 తేదీల్లో మీకు అనుకూలమైన ఏదైనా ఒక రోజు, హైదరాబాద్ లోని నా నివాసంలో మిమ్మల్ని కలుసుకోగలుగుతాను. అయితే దయచేసి వీలైనంత త్వరగా తేదీలను నిర్ధారించండి. నేను చట్టాన్ని గౌరవించే పౌరురాలిని మరియు విచారణకు సహకరిస్తాను. విచారణకు సహకరించేందుకు పైన పేర్కొన్న తేదీలలో ఏదో ఒక రోజున నేను మిమ్మల్ని కలుస్తాను. చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న నా చట్టపరమైన హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా నా సహకారం ఉంటుందని స్పష్టం చేయదల్చుకున్నాను” అని సీబీఐకి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE