తెలంగాణ భవన్లో డిసెంబర్ 27, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. జనవరిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్నిపల్ ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసంతో ఉన్నామని, ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో 63 సీట్లు గెల్చుకున్న టిఆర్ఎస్, గత అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. 2014 నుంచి తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టిఆర్ఎస్ పక్షానే నిలిచారని, టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. అంతేగాక ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా 60 లక్షల మంది గులాబీ సైనికులు ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో కొత్త పంచాయితీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం అయిందని, త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చామని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా పనిచేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టంలోని మొత్తం 141 మున్సిపాల్టీలకు గాను కొన్ని చోట్ల మినహా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే అజెండాతోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని, అలాంటి అజెండాను బలపరిచేలా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే అతి త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీ సభ్యులతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారని, మున్సిపల్ ఎన్నికలు, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు.
[subscribe]