తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. గత 17 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇచ్చే ప్రక్రియను అక్టోబర్ 21, సోమవారం కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఈ రోజు చేపట్టింది. ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై హైకోర్టులో అడ్వకేట్ జనరల్, పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
ఆర్టీసీ కార్మికులకు జీతాల చెల్లించేందుకు రూ.224 కోట్లు కావాలని, అయితే ఆర్టీసీ యాజమాన్యం వద్ద కేవలం రూ.7.5 కోట్లే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలియజేశారు. కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మె చేస్తున్నారని చెప్పారు. ఈ వివరణపై పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ, రాష్ట్రంలో సమ్మె కొనసాగుతున్న కూడ 50 శాతం బస్సులు తిరుగుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది, అలా వచ్చిన ఆదాయమంతా ఎక్కిడికి పోయింది ప్రశ్నించారు. తక్షణమే ఆర్టీసీలో ఉన్న 49,190 మంది కార్మికులకు జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. జీతాలు చెల్లించకపోవడం వలన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని న్యాయస్థానానికి వివరించారు. ఇరు పక్షాల వాదన విన్న హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదికి వాయిదా వేసింది.
[subscribe]