పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తేదీలను ఖరారు చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్ సభ, రాజ్యసభ కార్యదర్శులకు తెలియజేసారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులతో పాటు, పలు ఆర్డినెన్సులను చట్టాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దేశంలో ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కార్పొరేట్ కంపెనీలకు పన్ను మినహాయింపులను ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్డినెన్స్ ద్వారా దేశీయ కంపెనీల కార్పొరేట్ టాక్స్ ను 30 నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు.
అదేవిధంగా 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త దేశీయ తయారీ సంస్థలు ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా 15 శాతం ఆదాయపు పన్ను చెల్లించవచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక ఈ-సిగరెట్ల నిషేదిస్తూ గత నెలలోనే ఆర్డినెన్సు తీసుకొచ్చారు. ఈ సమావేశాలలో ఈ ఆర్డినెన్సులను బిల్లుల రూపంలో తీసుకురానున్నారు. దేశంలో ఆర్ధిక మాంద్యం ప్రభావం, పెరుగుతున్న ధరలు, ఇతర రాజకీయాల అంశాల దృష్ట్యా ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది.
[subscribe]