రాష్ట్రంలో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించి, గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రతను పాటిస్తే వానాకాలంలో వచ్చే అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోబడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజు పల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆదాయం పడిపోయినా అందరినీ సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని ఎక్కడా ఆపడం లేదన్నారు. ఉచిత బియ్యం, రూ.1500 ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పారు. కష్టాలున్నా, రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారన్నారు. ఒక్క ఉచిత విద్యుత్ కోసం ఒక్కో రైతుకు రూ.60వేలను ప్రభుత్వమే ఇస్తున్నదని చెప్పారు. రైతు బంధు కోసం రూ.7వేల కోట్లు, రూ.1200 కోట్లతో రుణ మాఫీతోపాటు రూ.30వేల కోట్లతో పంటల కొనుగోలు చేసిన ప్రభుత్వం దేశంలోనే లేదని మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు చెప్పారు. పంటల కొనుగోలు కోసం ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రూ.100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.
మక్కలతో ఈ వానాకాలంలో మనకేమీ లాభం లేదంటూనే, ప్రభుత్వం సూచిస్తున్న నియంత్రిత పంటలనే వేయండి-లాభసాటిగా మారండి అంటూ మంత్రులిద్దరూ ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయం దండగ కాదు, పండుగలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ దేశానికే గర్వ కారణమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ప్రజలకు తెలిపారు.
ముందుగా మంత్రులు ఇద్దరూ మేచరాజు పల్లి గ్రామంలో కలియతిరిగి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి , మంత్రి సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ, ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ, గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలని మంత్రులిద్దరూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వానా కాలం సీజన్ లో మరింత జాగ్రత్త వహించాలని, దోమల నివారణ, దోమలు పెరగకుండా చూడటం, నీటి నిల్వలు లేకుండా చూడటం, కాలువలను శుభ్రంగా ఉండేలా చేయడం వంటి చర్యలన్నీ చేపట్టాలని సూచించారు. మరోవైపు కరోనా కట్టడికి మాస్కులు ధరించాలన్నారు. స్వీయ నియంత్రణ, సామాజిక, భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా బారి నుండి మనల్ని మనమే రక్షించుకోవాలి. కరోనా విస్తరణను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను మంత్రులిద్దరూ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu