తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎనిమిదవ రోజు కూడ కొనసాగుతుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ, మొదలు పెట్టిన సమ్మెను ఉధృతం చేసే దిశగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెను తారా స్థాయికి తీసుకెళ్లే దిశగా తదుపరి కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నాడు ఆర్టీసీ జేఏసీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రజా సంఘాల నాయకులు, ఇతర జేఏసీ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఈ సమావేశంలో తదుపరి కార్యచరణ వివరించారు.
ఆర్టీసీ జేఏసీ తదుపరి కార్యాచరణ:
- అక్టోబర్ 13 – రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు కార్యక్రమం
- అక్టోబర్ 14 – డిపోల ముందు బైఠాయింపు, బహిరంగసభలు
- అక్టోబర్ 15 – రాస్తారోకోలు, మానవహారాలతో నిరసన
- అక్టోబర్16 – ఐకాసకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీలు
- అక్టోబర్17 – ధూంధాం కార్యక్రమాల నిర్వహణ
- అక్టోబర్ 18 – ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహణ
- అక్టోబర్ 19 – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్
[subscribe]