ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఏపీ పునర్విభజన చట్టం, 2014 సవరణ బిల్లును రేపు (ఏప్రిల్ 1) లోక్సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి లోక్సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లును కేంద్ర హోం శాఖ అధికారులు ఇప్పటికే చేర్చారు.
ఈ నేపథ్యంలో ముందుగా రేపు ఈ బిల్లు కేంద్ర కేబినెట్లో స్వల్ప చర్చ అనంతరం ఆమోదం పొంచనుంది. ఆ తర్వాత వెంటనే పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు పేరుతో కేంద్రం సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో బుధవారమే దీనికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని, ఒకవేళ ఏదేని కారణంగా అలా వీలుపడని పక్షంలో గురువారం (ఏప్రిల్ 2) నాటికి ఉభయ సభల్లోనూ ఆమోదం లభిస్తుందని పార్లమెంటరీ వర్గాలు భావిస్తున్నాయి.
బిల్లులోని ముఖ్యాంశాలు:
-
చట్ట సవరణ: 2014 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ 2కు కేంద్రం సవరణలు చేస్తోంది. దీని ద్వారా ‘అమరావతి’ని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా గుర్తిస్తున్నారు.
-
స్పష్టత: ఏపీ సీఆర్డీఏ (CRDA) చట్టంలోని క్యాపిటల్ ఏరియా పరిధిలోనే అమరావతి నగరం ఏర్పడుతుందని ఈ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.
-
రాష్ట్ర ప్రభుత్వ పాత్ర: రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించాలని కోరుతూ 2026, మార్చి 28న (శనివారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ చారిత్రక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సుమారు ఐదున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం, సభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
-
ఈ తీర్మానంలో ప్రధానంగా ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 5(2)లో ‘కొత్త రాజధాని’ అనే పదం ఉన్న చోట ‘అమరావతి’ అని చేర్చాలని కేంద్రాన్ని కోరారు. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెడుతోంది.
ఇక ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా అమరావతిపై గత కొంతకాలంగా ఉన్న అనిశ్చితి తొలగిపోనుంది. రాజధాని నగరం అభివృద్ధికి, కేంద్ర నిధుల కేటాయింపులకు ఈ చట్టబద్ధత ఎంతో కీలకం కానుంది. ఏపీ పునర్విభజన చట్టానికి జరుగుతున్న ఈ సవరణతో అమరావతి హోదాపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించినట్లవుతుంది.







































