పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించినప్పటికీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని, రాజ్భవన్కు వెళ్లను అని స్పష్టం చేశారు.
మమతా బెనర్జీ ఆరోపణలు – ముఖ్యాంశాలు:
-
ఎన్నికల సంఘంపై విమర్శలు: ఈ ఎన్నికల్లో ప్రధాన విలన్ కేంద్ర ఎన్నికల సంఘమేనని మమత ధ్వజమెత్తారు. ఈసీ పూర్తిగా బీజేపీకి ఏజెంట్గా మారిందని, సుమారు 100కు పైగా సీట్లను లూటీ చేశారని ఆరోపించారు.
-
రాజీనామాకు నిరాకరణ: “నేను ఎన్నికల్లో ఓడిపోలేదు. పక్కా ప్లాన్ ప్రకారం నన్ను ఓడించారు. అందువల్ల నేను రాజీనామా చేయను, నన్ను ఎవరూ ఒత్తిడి చేయలేరు” అని ఆమె ఖరాకండిగా చెప్పారు.
-
ఈవీఎంలపై అనుమానాలు: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 80 నుంచి 90 శాతం బ్యాటరీ ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. భవానీపూర్లో తనను ఉద్దేశపూర్వకంగా ఓడించేందుకు ఈసీని దుర్వినియోగపరిచారని, కౌంటింగ్ కేంద్రాల్లో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు.
-
ఓట్ల తొలగింపు: సుమారు 90 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించారని, కోర్టుకు వెళ్లడం వల్లే 32 లక్షల ఓట్లు తిరిగి చేర్చారని ఆమె విమర్శించారు.
‘ఇండి’ కూటమి మద్దతు:
ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఇండి’ (I.N.D.I.A) కూటమి తన వెంటే ఉందని మమత వెల్లడించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నాయకులు తనకు ఫోన్ చేసి మద్దతుగా నిలిచారని, తాను ‘ఇండి’ కూటమిలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో మమత తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.






































