ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో రూ.15 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించిన తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టిపిఎస్)ను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని, ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే పాత ఆలోచనా ధోరణి సమాజం నుంచి పూర్తిగా పోవాలని ఆకాంక్షించారు.
Live: Hon'ble CM Revanth Reddy participates in the Inauguration of Telangana Public School and the launch of the Breakfast Scheme at Arutla. https://t.co/XdKl45Xt9V
— Revanth Reddy (@revanth_anumula) June 17, 2026
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 లక్షల మంది విద్యార్థులకు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా డిజిటల్ క్లాస్రూమ్లు, అధునాతన సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లతో పాటు క్రీడా మైదానాలను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లల్లో మనోవికాసం పెరిగేలా, క్రీడలను ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికితీసేలా ఈ సరికొత్త విద్యా వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఆరుట్లలో ప్రారంభమైన పాఠశాల కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పడమే తమ ప్రభుత్వ తదుపరి కర్తవ్యమని స్పష్టం చేశారు.
గత పాలకులు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని, తమ ప్రభుత్వం విజ్ఞుల సూచనలు, మేధావుల సలహాలతో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పాఠశాల ఆవిష్కరణ తన మనసుకు ఎంతో నచ్చిన ప్రాజెక్ట్ (మానస పుత్రిక) అని, దీనిని విజయవంతం చేయడానికి రాత్రింబవళ్లు శ్రమించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, పూర్తి నమ్మకంతో ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లలో చేర్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనతో పాటు మానవ వనరుల వికాసానికి విద్యే మూలస్తంభమని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఆరుట్ల మోడల్ తరహాలోనే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే ఈ మోడల్ స్కూళ్లను అందుబాటులోకి తెస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి వినూత్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాయని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు.





































