రాజధాని అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమ్యాయి. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు శాసనసభ ఏడో సమావేశాలు, శాసనమండలి 50వ సమావేశాలు శ్రావణ సోమవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. ఇక శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్నందున ప్రజాప్రతినిధులందరూ సభా సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నియమనిబంధనలకు లోబడి అర్థవంతమైన చర్చలు జరపాలని అయ్యన్న పాత్రుడు సూచించారు.
సభలో ప్రతిపక్షం మరియు అధికార పక్షాల సభ్యులు లేవనెత్తే ప్రజాసమస్యలకు తగిన సమయం కేటాయిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. మీడియా, భద్రతా వసతులు మరియు ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించామని, అసెంబ్లీ వేదికగా ప్రజల గొంతుక వినిపించేలా సభా సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు.
సమావేశాల తొలిరోజున బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై సభా నిర్వహణ, పనిదినాలు మరియు చర్చించాల్సిన అంశాలపై స్పష్టమైన ఎజెండాను ఖరారు చేయనుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి, రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతం, పోలవరం ప్రాజెక్టు పురోగతితో పాటు రైతులకు మద్దతు ధర, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కీలక బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.
మరోవైపు అధికారులు శాసనసభ్యులు, మండలి సభ్యులకు కల్పించే సౌకర్యాలు, భద్రత మరియు ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లను క్షుణ్ణంగా పూర్తి చేసి, సమావేశాలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.







































