ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో ‘వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం’ మూడో విడత నిధుల పంపిణీ ప్రారంభించారు. ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పావలా వడ్డీకే రుణాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్దేనని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా ‘వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం’ ప్రవేశపెట్టామని, గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.3165 కోట్లు చెల్లించామని తెలిపారు.
తొలి ఏడాది రూ.1258 కోట్లు, రెండో ఏడాది రూ.1096 కోట్లు సున్నా వడ్డీ కింద చెల్లింపులు చేశామని చెప్పారు. ఈ సంవత్సరం రూ. 1261 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ డబ్బులను నేరుగా డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 2లక్షల 16 వేలమంది డ్వాక్రా మహిళలకు ‘వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం’ ద్వారా సహాయం చేశామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల సంఖ్య 80 లక్షల నుంచి కోటికి పెరిగిందని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ