పశు, మత్స్య, డైరీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలచేలా ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. జూలై 21, మంగళవారం నాడు అరణ్య భవన్ లో ఇరువురు మంత్రులు పశు సంవర్థక, మత్స్య , ఆర్థిక శాఖ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో అంగన్ వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నామని, దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో పాలు పాడవుతున్నాయని మంత్రి తలసాని చెప్పారు. ఈ పరిస్థితి తలెత్తకుండా టెట్రా ప్యాక్ లో విజయా డైరీ ద్వారా పాలు పంపేలా ప్రణాళికలు సిద్దం చేశామని ఇందుకు తగిన ఆర్థిక వనరులు సమకూర్చాలని మంత్రి హరీశ్ రావును కోరారు. ఈ విషయంపై పరిశీలన జరపాలని మంత్రి హరీశ్ రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. గోపాల మిత్రకు సంబంధించిన నిధులు నాలుగు నెలల నుంచి విడుదల కావాల్సి ఉందని, పాల సేకరణకు ప్రభుత్వం చెల్లిస్తున్న ఇన్సెంటీవ్ ను విడుదల చేయాలని మంత్రి తలసాని కోరారు. ఈ అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
అలాగే పశువులకు నట్టల మందులు తప్పకుండా వేయాలని తద్వారా మేకలు, గొర్రెల బరువు పెరుగుతాయని ఇందుకు తగిన నిధులు కావాలని మంత్రి తలసాని కోరగా, మంత్రి హరీశ్ రావు ఆర్థిక శాఖ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలన్నారు. నట్టల మందులు పశువులకు సమయానికి తగ్గట్టుగా వేయాలని ఇందుకు సహకరిస్తామని చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకం, చేప పిల్లల పంపిణీ వల్ల రాష్ట్రంలో పశు, మత్స్య సంపద అపారంగా పెరిగిందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దేశంలో పశు, మత్స్య సంపదలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లే పశు, మత్స్య సంపదలో తెలంగాణ రాష్ట్రం అద్బుత ఫలితాలు సాధిస్తోందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయడైరీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఉమ్మడి పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. కేంద్ర వాటా నిధులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలని, రాష్ట్ర వాటా నిధులు తదగుణంగా విడుదల అయ్యేలా ఆర్థిక శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందుగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu