భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 86432 పాజిటివ్ కేసులు నమోదవగా, 1089 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 5, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 40,23,179 కు, మరణాల సంఖ్య 69,561 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
మరోవైపు దేశంలో రోజుకి 1000 కి పైగా కరోనా మరణాలు నమోదవడం ఆందోళనగా మారింది. ప్రస్తుతం మరణాల రేటు 1.7 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 70,072 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 31,07,223 కు చేరుకోవడంతో కరోనా రికవరీ రేటు 77.2 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 8,46,395 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu