రష్యా రాజధాని మాస్కో నగరంలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశాల్లో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఎస్సీఓ మంత్రుల స్థాయి సమావేశంలో చైనాతో సరిహద్దుల అంశాన్ని మంత్రి రాజ్నాథ్ సింగ్ లేవనెత్తారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా చైనా రక్షణ మంత్రి వె ఫెంఝె, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య భేటీ జరిగింది. గత కొన్ని నెలలుగా భారత్-చైనా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఇరుదేశాల రక్షణ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రికతలు మొదలయ్యాక ఇప్పటి వరకు సైనిక ఉన్నతాధికారుల స్థాయిలోనే చర్చలు జరగగా, తొలిసారిగా ఈ అంశంపై దేశ రక్షణ మంత్రుల స్థాయిలో సమావేశం జరిగింది.
ఈ భేటీలో సరిహద్దు వివాదాలపై భారత్ వైఖరిని రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా తెలియజేసినట్లు తెలుస్తుంది. గల్వాన్ లోయ ఘటన, దేశ వాస్తవాధీన రేఖ వెంట పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల రాజ్నాథ్ సింగ్ నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికే పలు సందర్భాల్లో జరిగిన చర్చల్లో నిర్ణయించుకున్న ఒప్పందాలును చైనా పాటిస్తున్న పరిస్థితులు కనిపించడం లేదని చెప్పారు. వివాదాల్ని శాంతియుతంగా పరిష్కరించుకుని, ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేలా అడుగులు వేయాలని సూచించారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారేలాగా ఎటువంటి చర్యలకు పాల్పడొద్దని మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu