భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ ఉదయం నుంచి పలువురు ప్రముఖులు రాజ్ఘాట్ సందర్శించి మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, కేంద్రమంత్రులు, పలువురు నాయకులు నివాళులర్పించారు. జాతిపితకు నివాళులు అర్పించిన అనంతరం అక్కడ జరిగిన ప్రార్ధనా కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ జన్మదినాన్ని ప్రతి రాష్ట్రంలో గొప్పగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లోని లంగర్హౌస్ లో గల బాపూఘాట్ వద్ద మహత్ముడి విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ పూలమాల వేసి, నివాళులర్పించారు. గాంధీజీ 151వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు, సెలెబ్రిటీలు, క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా మహాత్మా గాంధీ ఆశయాలను స్మరించుకుంటున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయ్ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, లాల్బహదూర్ శాస్త్రి తనయులు అనిల్ శాస్త్రి, సునీల్ శాస్త్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు నివాళులు అర్పించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu