ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా పనిచేస్తున్న భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై బీసీసీఐ అంబుడ్స్మన్ గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినప్పటికీ రాహుల్ ద్రావిడ్ కి విముక్తి దొరకడంలేదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై గురువారం నాడు బోర్డు ఎథిక్స్ అధికారి డీకే జైన్ ముందు రాహల్ ద్రావిడ్ హాజరై వివరణ ఇవ్వనున్నారు.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా నియమితుడైన రాహుల్ ద్రావిడ్, అంతకుముందే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి సంబంధించిన ఇండియా సిమెంట్స్ సంస్థలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇలా ఒకచోట ఉద్యోగం చేస్తూ, ఎన్సీఏ డైరెక్టర్గా పనిచేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఆగస్టులో ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ కు ఫిర్యాదు చేశారు. ద్రావిడ్ ఈ అంశంపై ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇండియా సిమెంట్స్ ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవులో ఉన్నానని, ఆ కాలానికి కంపెనీ నుంచి ఎటువంటి జీత భత్యాలు పొందడం లేదని స్పష్టం చేసారు. చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రస్తుతం తనకెలాంటి సంబంధం ఎన్సీఏ డైరెక్టర్ పదవికే పరిమితమైనట్లు ప్రకటించారు. ఇదే విషయంపై ఈ రోజు మరోసారి డీకే జైన్ తో చర్చించనున్నారు. భేటీ అనంతరం డీకే జైన్ తుది నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది.