హైదరాబాద్ నగరంలో వరుసగా రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారీ వర్షాల వలన నగరంలో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రయాణికులు, వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, కూకట్పల్లి, ఎస్ఆర్నగర్, హిమాయత్నగర్, కొత్తపేట్, చైతన్యపురి, అబిడ్స్, కోఠి, ఉప్పల్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురిసింది. పలు చోట్ల రోడ్లు నీటితో నిండిపోయి చెరువులను తలపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటలవరకు నగరంలోని పలు ప్రాంతాల్లో 5 సెం.మీ పైగా వర్షపాతం నమోదైంది. నగరంలో మరో 48 గంటలపాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో గత వందేళ్ల కాలంలో నగరంలో ఇలాంటి భారీ వర్షం ఎప్పుడు కురవలేదని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భారీ వర్షాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. సహాయక చర్యల కోసం 384 ప్రత్యేక బృందాలతో దాదాపు 1000 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు 13 డిజాస్టర్ రెస్కూబృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, జీహెచ్ఎంసీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా నగరంలోని పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
[subscribe]