కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ రాహుల్ గాంధీలపై ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారంలో ఉండడం, అసలు వారిద్దరూ ప్రాణాలతో ఉండడమే సోనియా గాంధీ కుటుంబానికి ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఈ ఆరోపణలు చేసారు. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జైలులో ఉన్న అమిత్ షా మరణించాలని, మోడీని భౌతికంగా తొలగించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే సోనియా, రాహుల్ ఎక్కడుండే వాళ్ళని ప్రశ్నించారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరంపై కూడా బాబా రాందేవ్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఆయన ఆర్ధికమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షాను జైలులో హతమార్చడానికి కుట్రలు చేసారని, అమిత్ షాను జైలుకు పంపించడంలో కీలకపాత్ర వహించిన చిదంబరం కలలో కూడ తాను జైలుకు వెళ్తానని ఊహించి ఉండరని రాందేవ్ అన్నారు. చిదంబరం గతంలో చట్టాన్ని అతిక్రమించి తాను చేసిన పనులకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
[subscribe]