తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. గురువారం నాడు ఢిల్లీ వెళ్ళి, అక్టోబర్ 4 శుక్రవారం నాడు ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు విభజన హామీల పరిష్కారం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసే నిధుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని, ప్రాధాన్యత ఇచ్చి తగినంత నిధులు విడుదల చేయాలని కోరబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో మనుగడకు అవసరమైన ఆర్ధిక తోడ్పాటు చేయాలని ప్రధాని మోదీని కోరే అవకాశం ఉంది.
ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా ఆయన్ను కలవబోతున్నారు. మోదీ ప్రమాణస్వీకారానికి వెళ్లాలనుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంతో వెళ్లలేకపోయారు. ఈ భేటీలో రాష్ట్రంలో చేపడుతున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మోదీకి వివరించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించామని కోరే అవకాశం ఉంది. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం లో ఉక్కు పరిశ్రమ, జోనల్ వ్యవస్థలో మార్పులు ఇతర అనేక అంశాల గురించి చర్చించబోతున్నట్టు తెలుస్తుంది.
[subscribe]