భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ పార్టీ శ్రేణులు షాలీమార్ బాఘ్లో గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం ఆంగ్లేయులను వణికించిందని అన్నారు. సత్యా-అహింసల మార్గాన్ని గాంధీజీ ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు రాజ్ఘాట్ వరకు గాంధీ సందేశ్ యాత్ర చేపట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ నుండి దీన్దయాల్ ఉపాధ్యాయ మార్గ్ వద్ద ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్ఘాట్ వైపు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా జెండాలు ఊపుతూ మహాత్మా గాంధీ అమర్ హై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కూడ లక్నోలో పాదయాత్ర చేపట్టనున్నారు. లక్నోలోని షహీద్ పార్కు నుంచి జీవోపీ పార్కు వరకు ప్రియాంక పాదయాత్ర నిర్వహించి మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
[subscribe]