హుజూర్నగర్ ఉప ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒక్కసారిగా హుజూర్నగర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. హుజూర్నగర్ లో ఎలాగైనా గెలవాలని అధికార పక్షం, సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీలు లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నాలు వేగవంతం చేసాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలు, పక్షాలకు చెందిన ఓట్లను రాబట్టుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మంగళవారం నాడు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తో సంప్రదింపులు జరపగా, హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్కే మద్దతు ఇవ్వనున్నట్టు కోదండరాం బుధవారంనాడు పార్టీ కార్యాలయంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. హుజూర్నగర్ లో సర్పంచ్ లను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, మంత్రి వర్గమంతా ఈ ఉప ఎన్నికల కోసమే పని చేస్తుందని విమర్శించారు. మరోవైపు ఇటీవలే టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సీపీఐ మద్దతు కోరుతూ చాడ వెంకట రెడ్డిని కలువగా, ఈ ఎన్నికల్లో సీపీఐ పార్టీ టిఆర్ఎస్ పార్టీకే మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు. అయితే కోదండరామ్ ఈ విషయంపై స్పందిస్తూ టిఆర్ఎస్ కు సీపీఐ మద్ధతు ఇవ్వడం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు.
[subscribe]