హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదం లభించిందని టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసి రాష్ట్రంలో చేపట్టాల్సిన పలు జాతీయ రహదారులు తదితర అంశాలపై ఎంపీ నామా నాగేశ్వరరావు చర్చించారు. ఈ సందర్భంగా రీజినల్ రింగ్ రోడ్డుపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 354 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించిన విషయాన్ని, అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు సార్లు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని కేంద్రమంత్రికి నామా నాగేశ్వరరావు వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో నాగపూర్-హైదరాబాద్- బెంగళూరు కారిడార్, పుణె-హైదరాబాద్- విజయవాడ కారిడార్ ల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు.
అలాగే కోదాడ-ఖమ్మం మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని నామా నాగేశ్వర్రావు తెలిపారు. 31.80 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి అవసరమైన భూసేకరణ పూర్తి అయిందని, త్వరలో టెండర్లు పిలువనున్నట్టు తెలిపారని చెప్పారు. అదేవిధంగా ఎన్హెచ్167 అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు రోడ్డు విస్తరణ కోసం కేంద్రం రూ.220 కోట్లు మంజూరు చేసిందని, ఈ రహదారిని నాలుగులైన్లుగా విస్తరణ చేస్తే మరో రూ.65నుంచి రూ.70 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని, సమయం, వ్యయం కలిసివస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలిపినట్టు నామా నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో మహబూబు నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ