హుజూర్నగర్ ఉప ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ మద్దతును టిఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నట్టు సీపీఐ పార్టీ ప్రకటించింది. అయితే అక్టోబర్ 14, సోమవారం నాడు టీఆర్ఎస్ పార్టీకి ప్రకటించిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై హుజూర్నగర్ నియోజకవర్గ కమిటీని సంప్రదించి రెండు రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపారు.
గత పది రోజులనుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నా, తెలంగాణ ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా, అన్యాయంగా ఉందని చాడ వెంకట్రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. సమ్మెను అణిచివేయాలని చూస్తూ, కార్మిక సంఘాలతో ఎటువంటి చర్చలు జరపకుండా 48 వేల మంది కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పి ప్రభుత్వం వారిని రెచ్చగొట్టిందని చెప్పారు. కొత్త నియామకాలను ప్రోత్సహిస్తూ, వారికీ ఆర్టీసీ కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని ప్రేరేపించొద్దని సీపీఐ పార్టీ విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కార్మిక, శ్రామికవర్గ పార్టీ అయిన సీపీఐ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రకటించిన మద్దతు ఉపసంహరించుకున్నట్టు చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు.
[subscribe]