తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబర్ 15, సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తో గవర్నర్ తమిళిసై భేటీ అవుతారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, అనేక కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
టిఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు, పలు కార్మిక సంఘాల నేతలు అక్టోబర్ 14, సోమవారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఆర్టీసీ సమ్మె, తదనంతరం జరిగిన సంఘటనలపై ఆమెకు వివరించి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ వ్యాప్తంగా 11 రోజుల నుండి సమ్మె కొనసాగుతుండడం, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై జోక్యం చేసుకోవాల్సిందిగా జేఏసీ నాయకులు ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సమ్మెకు దారి తీసిన పరిస్థితులు, గత కొన్ని రోజులుగా తెలంగాణాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నివేదిక కోరడానికే గవర్నర్ ఢిల్లీ పర్యటనకు పిలుపు వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
[subscribe]