తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డా వి.నర్సింహాచార్యులు మంగళవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 15, సోమవారం ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశం కానున్నాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సభను ఎన్ని రోజులు నిర్వహించేలా విషయంతో పాటుగా సమావేశాల పూర్తి ఎజెండాను ఖరారు చేయనున్నారు. అలాగే శాసనసభలో మార్చి 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం గత శనివారం నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు. ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా, ఇరిగేషన్ తదితర శాఖలను వరుసగా పిలిచి, ఫైనాన్స్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ