టీఎంసీ అధినేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బుధవారం నాడు నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలుకు ముందు ఆమె స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యకర్తలతో కలిసి నందిగ్రామ్లో రోడ్ షో నిర్వహించిన అనంతరం హల్దియా సబ్-డివిజినల్ కార్యాలయంకు చేరుకొని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసిన సమయంలో ఆమె వెంట టీఎంసీ పార్టీ అధ్యక్షుడు సుబ్రతా భక్షి ఉన్నారు. ఇక నందిగ్రామ్ స్థానం నుంచి మమతాబెనర్జీకి పోటీగా సువేందు అధికారిని బీజేపీ బరిలోకి దించుతోంది.
ముందుగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ మరియు నందిగ్రామ్ లలో రెండు చోట్ల మమతా బెనర్జీ పోటీచేయనున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ, చివరికి ఆమె నందిగ్రామ్ వైపే మొగ్గుచూపారు. భవానీపూర్ స్థానంలో మమతా బెనర్జీకి బదులుగా టీఎంసీ నాయకుడు సోవన్ ఛటర్జీ పోటీ చేయనున్నారు. ఇప్పటికే 291 స్థానాలకు గానూ టీఎంసీ అభ్యర్థులను సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. మిగిలిన మూడు చోట్ల మిత్రపక్షాలకు సీట్లను కేటాయించారు. మరోవైపు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, మే 2వ తేదీన ఓట్లలెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ