మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ, శివసేనలలో ఏ పార్టీ దక్కించుకుంటుందనే ఉత్కంఠ నెలకుంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలంటే సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పార్టీ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31, గురువారం నాడు ముంబయిలో శివసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. ఏక్నాథ్ షిండేను పార్టీ శాసనసభాపక్ష నేతగా, సునిల్ ప్రభును చీఫ్ విప్గా ఎన్నుకున్నారు. ముందుగా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉద్ధవ్ థాకరే కుమారుడు, ఆదిత్యథాకరే ను ఎంచుకోబోతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి, అయితే అందుకు ఉద్ధవ్ ఇష్టపడలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్నాథ్ షిండే పేరును ఆదిత్య ప్రతిపాదించగా, మిగిలిన శివసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ సమావేశంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్రకు ఈసారి శివ సైనికుడే ముఖ్యమంత్రి కాబోతున్నాడని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎటువంటి తొందరలేదని, 50:50 పదవీ కాలం డిమాండ్ పై వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ టచ్లో ఉంటున్నారని, కాంగ్రెస్ మరియు ఎన్సీపీ పార్టీలతో కూడా టచ్లో ఉన్నామని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ‘మాకు ఇచ్చిన హామీకే కట్టుబడి ఉండమని అడుగుతున్నాము. ఎన్నికలకు ముందు బీజేపీ సమస్యను మేము అర్థం చేసుకున్నాము, కాని నేను నా పార్టీని కూడా నడపాలనుకుంటున్నాను ‘ అని ఈ సమావేశంలో ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు కైవలం చేసుకున్నాయి. బీజేపీ-శివసేన పార్టీలు కూటమిగా పోటీచేసి చేసి మెజారిటీ మార్కును విజయవంతంగా దాటగలిగాయి, అయితే రెండు పార్టీల మధ్య 50:50 పదవీ కాలం అంశం తెరపైకి రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కొరవడింది.
[subscribe]