యావత్ భారతదేశం ఏంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య లోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నవంబర్ 9, శనివారం నాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. 2010లో అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలోనే ఉంచి రామ మందిర నిర్మాణం, ట్రస్ట్ ఇతర విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలి. మసీదు నిమిత్తం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు సంబంధిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని కోర్టు పేర్కొంది. ముందుగా ఐదుగురు న్యాయమూర్తులు కలిసి ఈ ఏకగ్రీవ తీర్పును వెలువరించారు. తీర్పును ఉదయం 10:30 గంటలకు ప్రారంభించి అరగంట పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చదివి వినిపించారు. తీర్పు చదవడం ప్రారంభించిన వెంటనే షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్, నిర్మోహి అఖాడా పిటిషన్ కూడ కొట్టివేస్తునట్టు చెప్పారు. ఈ తీర్పుపై నిర్ణయానికి ముందు రెండు మతాలను యెక్క విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. పురావస్తు నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందన్నారు. అక్కడ మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, అక్కడ హిందూ నిర్మాణమే ఉందని పురావస్తు విభాగం చెబుతుందని యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ నిబంధనల ప్రకారం నిర్ణయిస్తామని చెప్పారు.
అయోధ్యను రామజన్మభూమిగా హిందువులు భావిస్తున్నారని, మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదన్నారు. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని పేర్కొన్నారు. మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని గతంలో హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేశారనేందుకు ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసినట్టు కూడ ఆధారాలు ఉన్నాయి. అయితే మొఘలుల కాలం నాటి నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని చెప్పారు. సుదీర్ఘమైన తీర్పును చదివిన జస్టిస్ రంజన్ గొగోయ్ చివరికి 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని హిందువులకే కేటాయిస్తూ తుది తీర్పు వెలువరించారు. మరో వైపు అయోధ్యపై తుది తీర్పు సందర్భంగా హింసను ప్రేరేపించినా లేదా విద్వేషపూరిత సందేశాలు పంపించిన కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు పార్టీల ప్రముఖ నాయకులు తీర్పు ఎలా ఉన్నా గౌరవించి ముందుకుసాగాలని, అందరూ ఐకమత్యంగా మెలగాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
[subscribe]