టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కృష్ణా జిల్లా కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై పలువురు నాయకులతో కలిసి దేవినేని ఉమా ఆ ప్రాంత పర్యటన వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉమా కారును అడ్డుకుని, పర్యటనపై ప్రశ్నించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుల వాహనాలపై చోటుచేసుకున్న రాళ్లదాడి ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు ఆరు గంటల హైడ్రామా అనంతరం అర్ధరాత్రి సమయంలో పోలీసులు దేవినేని ఉమను అదుపులోకి తీసుకుని ముందుగా పెదపారపూడి పోలీస్స్టేషన్ కు తరలించారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్తో పాటు 307 హత్యాయత్నం కింద పోలీసులు కేసులు పెట్టారు.
దేవినేని ఉమను అరెస్ట్ చేశామని, ఆయన పోలీసుల కస్టడీ లోనే ఉన్నారని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలించారని, ఆయనపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నామని చెప్పారు. ఈ కేసుపై పూర్తి పారదర్శకంగా విచారణ చేస్తున్నామని చెప్పారు. మరోవైపు దేవినేని ఉమా ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి సృష్టించారని డీఐజీ మోహనరావు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ