కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన అనంతరం మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బసవరాజ్ బొమ్మైకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్ గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో బసవరాజ్ బొమ్మై చేత గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. బసవరాజ్ బొమ్మైతో పాటుగా ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవిందా కారజోళ ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు నేతలు హాజరయ్యారు.
లింగాయత్ కమ్యూనిటీకి చెందిన బసవరాజ్ బొమ్మై యడియూరప్పకు బాగా సన్నిహితంగా ఉండడమే కాకుండా, ఆయన కేబినెట్ లో హోమ్ మినిస్టర్ గా పనిచేశారు. రాష్ట్రంలోని హవేరి జిల్లా, షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి బసవరాజ్ బొమ్మై ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త సీఎం రేసులో పలుపేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో యడియూరప్ప తర్వాత లింగాయత్ కమ్యూనిటీలో బలమైన నేతగా ఉన్న బసవరాజ్ బొమ్మై వైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపింది. మరోవైపు బసవరాజ్ బొమ్మై తండ్రి ఎస్.ఆర్.బొమ్మై కూడా గతంలో కర్ణాటక సీఎంగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ