ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు రెండు కీలక పదవులకు నియామక ఉత్తర్వులు జారీచేసింది. వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ( ఏపీఐఐసీ) చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటినుంచి వైసీపీ పార్టీలో కీలక భూమిక పోషించిన రోజాకి , ఎన్నికలలో విజయం తరువాత మంత్రి పదవి దక్కుతుందని అందరు అంచనా వేశారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి దక్కలేదు, ఈ తరుణంలో అసంతృప్తి తో ఉన్న రోజాకు కీలక పదవి అప్పజెప్తామని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆమెను ఏపీఐఐసీ చైర్మన్ గా నియమించారు.
మరో వైపు ఇప్పటివరకు కేంద్ర సర్వీసులో, కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి గా బాధ్యతలు వహించిన ఏవీ ధర్మారెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ జెఈవో గా రావాలనుకున్న అతని అభ్యర్ధనను, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో, కేంద్ర ప్రభుత్వం ఆయన డిప్యూటేషన్ను అనుమతిస్తూ రిలీవ్ చేసింది. స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ జెఈవో బాధ్యతలను నిర్వహిస్తారని ప్రభుత్వ జీవో లో పేర్కొన్నారు.