సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశుసంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్ పుర కృష్ణకాలనీలో కట్ట మైసమ్మ సిల్వర్ కాంపౌండ్ రూ.17.36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన జి+3 అంతస్తుల గల 8 బ్లాక్ లలో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధికి దూరంగా ఉందని ఇక్కడ పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏమాత్రం నిధులు తెచ్చే అవకాశం లేదన్నారు. కంటోన్మెంట్ ఏరియా చుట్టు ప్రక్కల ప్రాంతం ఎంతో అద్భివృద్ది చెందినట్లు జీహెచ్ఎంసీలో విలీనమైతే సంక్షేమ అధివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతాయన్నారు. కంటోన్మెంట్ ఏరియా పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని జీహెచ్ఎంసీలో విలీనం అయితే పేదలకు మరిన్ని గృహాలు నిర్మించి ఇవ్వవచ్చాన్నారు. తద్వారా పేదలు గొప్పగా బ్రతికే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగతా ప్రాంతాలలో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. బీదలు ఆత్మాభిమానంతో గొప్పగా బ్రతకాలనే ముఖ్యమంత్రి ఆశయంతో రెండు పడకల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో మంజూరు చేసిన గృహాల కాలనీలకు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టలేదు. రెండు పడకల గృహాల కాలనీ విద్యుత్తు, త్రాగునీరు, సీసీ రోడ్లు సదుపాయాలను కల్పించామన్నారు. ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులకు 56 గృహాలను మంత్రి మంజూరు చేశారు. రెండు పడకల గదుల నిర్మాణాల డిజైన్ రూపకల్పన ముఖ్యమంత్రి చేశారన్నారు. రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడుతారు. వారు ఇక్కడికి వచ్చి చూడాలన్నారు. వారికి పేదలు గొప్పగా బ్రతుకాలనే ఆలోచన లేదని, గత ప్రభుత్వాల హయాంలో లబ్ది దారులకు కొంత శాతం సబ్సిడీతో మంజూరు చేసేవారని కానీ ఈ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా రెండు పడకల గదులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ నిరుపేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు భీమా పథకాలతో పాటు ఆసరా ఫించన్లు, షాదీ ముబారక్ లాంటి పథకాలు మరెక్కడా లేవన్నారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతానికి నిధులు మంజూరు కాక అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు అభివృద్ధికి కృషి చేసింది. ధనవంతులు నివసించే గృహాల మాదిరిగా డబుల్ బెడ్ రూం గృహాలను పేదలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. శాసన సభ్యులు సాయన్న మాట్లాడుతూ గతంలో ఈ కాలనీ ప్రజలకు అడ పిల్లలను ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదని, ముఖ్యమంత్రి కృషి మేరకు పేదలకోసం రెండు పడకల గృహాలను నిర్మించి పంపిణీ పండుగ వాతావరణంగా ఉందని అన్నారు. మరొక 56 గృహాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
కరోనా వ్యాధి మూలంగా నిర్మాణ పనులు జాప్యం జరగడానికి కారణమన్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పేదల కోసం ఎక్కడ లేని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు 168 మంది లబ్దిదారులకు ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జీహెచ్ఎంసీ హౌసింగ్ ఓ.యస్ డి శంకరయ్య, ఆర్డీవో వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ