రాష్టంలో రైతాంగ సమస్యలను తెలియజేస్తూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12, గురువారం నాడు ‘రైతు సౌభాగ్య దీక్ష’ చేపట్టారు. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా చేపట్టిన ఈ దీక్షకు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, పలువురు పార్టీనాయకులు, రైతు సంఘాల నేతలు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. సాయంత్రం వరకు కొనసాగనున్న ఈ దీక్షలో పలువురు రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖీ నిర్వహిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని, స్వయం సమృద్ధి సాధించినా రైతుల బతుకులు మారడంలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కులాలకు అతీతంగా అర్హులందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరంలో సన్నబియ్యం శాంపిల్స్ ను, చౌకధర దుకాణాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం శాంపిల్స్ ను రైతులు పవన్ కళ్యాణ్ కు చూపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి తరలివచ్చిన రైతులు వాళ్ళు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.
[subscribe]