ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19న కోల్కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తొలిదశలో 971 మంది క్రికెటర్ల నుంచి 332 మందికి జాబితాను కుదిస్తూ ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 332 ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను మొత్తం 8 ఫ్రాంచైజీలకు పంపించారు. ఈ జాబితాలో 19 మంది భారత ఆటగాళ్లు(క్యాప్డ్ ప్లేయర్లు)తో పాటు 24 మంది కొత్త ఆటగాళ్ళు కూడా ఉన్నారు. వీరిలో వెస్టిండీస్ పేసర్ కేస్రిక్ విలియమ్స్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మరియు 21 ఏళ్ల సర్రే బ్యాట్స్మెన్ విల్ జాక్స్ ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో ప్రస్తుతం ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 73 మంది క్రికెటర్లను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.
భారత ఆటగాళ్లలో కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన రాబిన్ ఊతప్ప మూల ధర 1.5 కోట్ల రూపాయలు కాగా, గతంలో రాజస్థాన్ రాయల్స్ 8.4 కోట్ల రూపాయలు చెల్లించిన జయదేవ్ ఉనద్కట్ తన మూల ధరను 1.5 కోట్ల నుండి 1 కోటికి తగ్గించుకున్నాడు. విదేశీ ఆటగాళ్ళలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమ్మిన్స్, హాజిల్వుడ్, మిచెల్ మార్ష్, డేల్ స్టెయిన్, మరియు ఏంజెలో మాథ్యూస్ తమ మూల ధరను 2 కోట్లగా కలిగి ఉన్నారు. క్రిస్లిన్, ఆరోన్ఫించ్, జేసన్ రాయ్, గ్లెన్ మాక్స్వెల్, ఇయాన్ మోర్గాన్, కమిన్స్, రాబిన్ ఉతప్ప వేలంలో భారీ ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. వేలంలో ముందుగా బ్యాట్స్మెన్ ను ఎంచుకుంటారు, ఆ తరువాత ఆల్రౌండర్లు, కీపర్లు, పేసర్లు, స్పిన్నర్లు వస్తారు. డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఈ వేలంలో కీలక ఆటగాళ్లను చేజిక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి.