డిసెంబర్ 26, గురువారం నాడు సూర్య గ్రహణం కారణంగా తిరుమల, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నాయి. సూర్య గ్రహణం కారణంగా 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబర్ 25, బుధవారం రాత్రి 11 గంటల నుంచి డిసెంబర్ 26, గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు ప్రకటించారు. 26వ తేదీ ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం సమయం కావడం వలన, గ్రహణానికి ఆరుగంటల ముందు నుంచి ఆలయం తలుపులు మూసివేస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆలయశుద్ధి గావించి, 2 గంటల నుంచి స్వామి వారి దర్శనం మొదలవుతుందని చెప్పారు. ఆలయ తలుపులు మూసిన సమయంలో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా మూతపడనుంది. గ్రహణం వలన తిరుప్పావడ, కల్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవ సేవలు కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు సూర్య గ్రహణం కారణంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల ద్వారాలను మూసివేస్తునట్టు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. డిసెంబర్ 26, గురువారం ఉదయం 11.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్టు ఆయన చెప్పారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 26వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. సూర్య గ్రహణం కారణంగా శ్రీశైలంలో ప్రధాన దేవాలయంతో పాటు ఉప ఆలయాలైన సాక్షి గణపతి, హటకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలను కూడా ఆ రోజు మూసివేస్తునట్టు ఈవో పేర్కొన్నారు.