ఇంఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రేపుతోంది. అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. వైసీపీలో రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కోవలో ఇటీవల మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో పాటు.. సరైన ప్రధాన్యత కూడా లేకపోవడంతో వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలో జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో అధికారికంగా జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్తో బాలశౌరి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో బాలశౌరి పోటీ చేయబోయే స్థానం గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
బాలశౌరి 2004లో కాంగ్రెస్ తరుపున తెనాలి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరుపున గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 వైసీసీ బాలశౌరిని మచిలీపట్నం నుంచి బరిలోకి దించింది. ఈసారి బాలశౌరి గెలుపొంది పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అయితే కొద్దిరోజులుగా పార్టీలో సరైన ప్రధాన్యత దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా పార్టీలోని పలువురు కీలక నేతలతో బాలశౌరికి విబేధాలు ఉన్నాయి.
ఇక వచ్చే ఎన్నికల్లో బాలశౌరికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరించింది. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని చూస్తోంది. ఈక్రమంలో బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి.. జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అటు జనసేన తరుపున మచిలీపట్నం నుంచి బాలశౌరి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈక్రమంలో మచిలీపట్నం నుంచే బాలశౌరిని బరిలోకి దింపాలని జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. పొత్తు కారణంగా స్థానాలపై తుది నిర్ణయం తీసుకున్నాక.. తనకు కేటాయించిబోయే నియోజకవర్గంపై నిర్ణయం తీసుకుంటామని బాలశౌరితో పవన్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ