తిరుపతి రాజకీయాలు రంజుగా మారాయి. ఓవైపు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే ఇటు కూటమి స్పీడ్కు కాస్త బ్రేకులు పడ్డాయి. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కూటమి పార్టీల నేతల్లో అంతర్గత రచ్చకు దారి తీశాయి. ఒకవేళ అన్ని సెట్ అయ్యాయని అనుకున్నా ఏదో ఒక రూపంలో గొడవ మొదలవుతోంది. తాజాగా తిరుపతి లోక్సభ స్థానంలోనూ అదే జరుగుతోంది. తిరుపతి లోక్సభ స్థానం చుట్టూ వివాదం ముదురుతోంది.
ఆయన హిందూ వ్యతిరేకా?
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ రావును ఎంపిక చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. వరప్రసాద్ ను బరిలోకి దింపాలన్న నిర్ణయాన్ని ఆరెస్సెస్, బీజేపీ కోర్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వరప్రసాద్ 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ఉన్న సమయంలో హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఆలయ నగరమైన తిరుపతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో వరప్రసాద్ తిరుమల శ్రీవారిని ఎప్పుడూ సందర్శించలేదని అంటున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వరప్రసాద్ రావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాంపై విజయం సాధించారు. వరప్రసాద్ రావుపై మతపరమైన వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ కారుమంచి జయరామ్ దాఖలు చేసిన పిటిషన్ ఐదేళ్లుగా అపరిష్కృతంగానే ఉంది. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ రావు మళ్లీ తెరపైకి రావడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. వరప్రసాద్ రావు అభ్యర్థిత్వంపై బీజేపీలోని వర్గాలు అంతర్గత అసమ్మతిని వెల్లడించాయి. ప్రస్తుతం నెలకొన్న గందరగోళాన్ని చల్లార్చేందుకు తగిన ప్రత్యామ్నాయ అభ్యర్థిని గుర్తించే అంశంపై పార్టీలోనే చర్చ మొదలైంది. వీరి స్థానంలో మాజీ బ్యూరోక్రాట్ దాసరి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.ముని సుబ్రమణ్యం పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ అంతర్గత వివాదాన్ని పరిష్కరించడం, అభ్యర్థి ఎంపికలో బీజేపీ సమాలోచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE