తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుబాటులో ఉన్న అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం బాటిల్ పరిమాణాన్ని బట్టి ధరల పెంపును అమలు చేయనున్నారు. క్వార్టర్పై రూ.20, హాఫ్పై రూ.40, ఫుల్పై రూ.80 పెంచుతున్నట్లు అబ్కారీశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ డిసెంబర్ 16, సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే పెంచిన ధరలు డిసెంబర్ 17, మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. మరో వైపు పాత మద్యం నిల్వలకు కొత్త ధరల పెంపు వర్తించదని ఎక్సైజ్శాఖ స్పష్టం చేసింది. ఏడాదిన్నర క్రితం మద్యంపై రూ.5 ధర పెంచిన ప్రభుత్వం, 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా అత్యధికంగా 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల పెంపు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కొత్త సంవత్సర వేడుకలకు ముందు మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
[subscribe]