విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని చెప్పారు. అలాగే అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సరి సమానంగా అభివృద్ది చెందుతాయని అన్నారు. అధికారం కోసం ఆశపడకుండా ప్రజలకు సేవ చేయడానికే సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. విశాఖలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భారీ కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
[subscribe]