తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం సెక్యులర్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో సీఎం కేసీఆర్తో పాటు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ క్రిస్మస్ ట్రీ ని వెలిగించి, క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమని చెప్పారు. ఏదైనా ఒక క్రిస్టియన్ దేశానికి వెళితే ఒకటో రెండు పండుగలు ఉంటాయని, లేదా ఒక ముస్లిం దేశానికో, మరో హిందూ దేశానికకో వెళ్లినా అక్కడా సంవత్సరానికి మూడో, నాలుగో పండుగలుంటాయి. కానీ మన దేశంలో మాత్రం ఎన్నో పండుగలు, ఇంకెన్నో వేడుకలు జరుపుకుంటామని చెప్పారు.
తెలంగాణలో అన్ని మతాలకు సమాన ఆదరణ ఉంటుందని, తమ ప్రభుత్వం అన్ని మతాలనూ గౌరవిస్తుందని చెప్పారు. ఇదే మైదానంలో ఇఫ్తార్, బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్ ఉత్సవాలు నిర్వహించుకుని, పరస్పరం అభినందించుకుంటామని అన్నారు. తాగునీరు, విద్యుత్ సమస్యలు లేని విధంగా రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వానికి ఏదైనా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు పట్టేదని, కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏంతో కాలం పట్టే కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగు సంవత్సరాలలోనే పూర్తి చేశామని, రానున్న రోజుల్లో కాళేశ్వరం ద్వారా 70 నుంచి 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.
[subscribe]