తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న 8 మెడికల్ కాలేజీల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గురువారం నాడు మెడికల్ కాలేజీల నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్తగా 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు చెప్పారు. మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులు ఏప్రిల్ లో పూర్తవుతాయన్నారు. అనంతరం మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక రామగుండం మెడికల్ కాలేజి మొదటి విడత నిర్మాణం ఈఏడాది జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశానుసారం మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఎన్ఎంసీ నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. మెడికల్ కాలేజీల ప్రస్తుత నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తి నాణ్యతతో నిర్దేశిత సమయంలో పూర్తి కావాలన్నారు. భవన నిర్మాణాలు పూర్తయిన చోట మొదటి సంవత్సరం మెడికల్ కాలేజీ నిర్వహణకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం టీఎస్ఎండీసీతో సమన్వయం చేసుకోవాలని ఈఎన్సీ గణపతి రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, సి.ఈ సతీష్, పి.ఎస్ ముకుంద్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ