ఎన్నికలు రాబోతున్నాయంటే చాలు.. పార్టీల గెలుపోటములపై రకరకాల ఊహాగానాలు.. విభిన్న చర్చలు మొదలవుతుంటాయి. పలు సంస్థల పేరిట సర్వేలూ వస్తుంటాయి. చిత్రం ఏంటంటే.. ఒక్కో సర్వే లో జనం అభిప్రాయం ఒక్కోలా కనిపిస్తుండడం. ఒక సర్వే అధికార పార్టీ జై కొడితే.. మరో సర్వే విపక్షాన్ని అధికార పక్షంలో నిలబెడుతుంది. వీటిలో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక జనం తికతిక పడుతుంటారు. వాటిలో ప్రామాణికం అంత అనేది తెలియక గందరగోళానికి గురవుతుంటారు. ప్రతీ ఎన్నికలకు ఇది సర్వసాధారణమే. తెలంగాణ ఎన్నికల వేళ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.. ఇంకో నెల రోజుల పాటు జరుగుతూనే ఉంటుంది.
ఒక పార్టీ అభిమాని పోస్టులు కానీ.. స్టేటస్ లు కానీ చూస్తే.. ఆ పార్టీ విజయానికి దోహదపడేలా ఉన్న సంస్థల సర్వేలు మాత్రమే కనిపిస్తాయి. ఒక పార్టీ అనుకూల మీడియా సంస్థల్లోనూ అదే పరిస్థితి. ఇందులో వేటిని నమ్మాలి.. అనే సందిగ్ధత సాధారణ ప్రజానీకంలో మొదలవుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న సర్వే రిపోర్ట్ లను పరిశీలిస్తే జనతా కా మూడ్ సంస్థ నిర్వహించిన సర్వే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 72–75 సీట్లు, కాంగ్రెస్కు 31–35 సీట్లు, ఎంఐఎంకు 6–7 సీట్లు, బీజేపీకి 4–6 సీట్లు దక్కనున్నాయి. టైమ్స్నౌ–ఈటీజీ సర్వేలోనూ బీఆర్ఎస్ కే అగ్ర పీఠం. టైమ్స్ నౌ సీఎన్ ఎక్స్ పేరుతో ప్రచారంలో ఉన్న మరో సర్వే బీఆర్ ఎస్ కు 35 సీట్లే అంటోంది. కాంగ్రెస్ కు 70, బీజేపీ 5, ఇతరులలో 9 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతోంది. మిషన్ చాణక్య అయితే బీఆర్ ఎస్ కు 70–76 అంటుంటే.. రిపబ్లిక్ సీ – ఓటర్ 42 అంటోంది. ఆత్మసాక్షి పేరుతో వచ్చిన సర్వే అధికార పార్టీకి 64–70 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతుంటే.. న్యూస్ ఎక్స్ నేత 40 మాత్రమే అంటోంది.
ఇలా విభిన్న తరహా అంకెలతో సర్వేలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో దేన్ని నమ్మాలో తెలియక సగటు ఓటరు గందరగోళానికి గురవడం.. నవ్వుకోడం ప్రతీ ఎన్నికలకు మామాలే. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితి చూస్తే.. మౌత్ టాక్ ద్వారా కాంగ్రెస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటే.. ప్రజల కళ్లముందు కనిపిస్తున్న దృశ్యాల్లో మాత్రం బీఆర్ఎస్ ఉంది. బీజేపీ అయితే కనీసం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. రాబోయే సర్కారు మాదేనని నోటి మాటలు తప్ప తగిన కార్యాచరణ కానీ, కార్యక్షేత్రంలోకి దిగింది కానీ లేదు. అంతేకాదు.. నేటి నుంచి నామినేషన్లు మొదలు కానుండగా ఇంకా టిక్కెట్ల కేటాయింపులే పూర్తికాలేదంటే వాటి దుస్థితిని అంచనా వేసుకోవచ్చు. కాంగ్రెస్ కూడా ఇంకా కొన్ని టికెట్లను ఖరారు చేయలేదు. లక్ష్యం సాధించే వారి తీరుగా బీఆర్ఎస్ నేతలు ముందంజలో ఉన్నారు.
ఇక సర్వేల విషయానికి వస్తే.. ఒక్కో సంస్థ ఒక్కో పార్టీకి పట్టం కడుతోంది. వీటిలో కొన్ని సంస్థలు మాత్రం తమ విలువలు, నమ్మకం కోల్పోకుండా ప్రజాభిప్రాయాన్నే వెల్లడిస్తుంటాయి. మరికొన్ని తమకు కాంట్రాక్ట్ ఇచ్చిన పార్టీలకే జై కొడుతుంటాయి. అందువల్ల అంతిమంగా ప్రజల తీర్పే రాజు ఎవరనేది తేలుస్తుంది. సో.. ఈ సర్వేలను చూసి నమ్మేయకుండా.. నవ్వేసుకుని పనిచేసే, నమ్మకమున్న నేతకు పట్టం కట్టడమే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE