రెండు తెలుగు రాష్ట్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) లభించక, ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్ఎస్పి కంటే తక్కువ ధరకు తమ వరిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన కొద్ది మంది రైతుల కేస్ స్టడీలను వివరిస్తూ, కేవలం 40 శాతం మాత్రమే వరిని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రాలలోని మిల్లర్లు/వ్యాపారస్తులు స్థానిక సేకరణ అధికారులతో కుమ్మక్కై ఆన్లైన్ డేటాబేస్లో బినామీ వివరాలను నమోదు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన ఈక్రాప్ డేటాబేస్ మరియు దిగుబడి డేటాను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డేటాబేస్లలో తేడా ఉందని, భారీ అవినీతి జరిగిందనటానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
అయితే, దీనికి ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం సేకరణలో ఏపీ, తెలంగాణలో అవకతవకలు జరిగాయని తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానం ఇచ్చారు. రైతుకు ధాన్యం సేకరించిన వెంటనే డబ్బు చెల్లించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రాలకు 90 శాతం ధాన్య సేకరణ సొమ్ము ముందుగానే చెల్లిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అయితే అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామని మంత్రి వెల్లడించారు. దీనిపై ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల విచారణ వల్ల ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వమే స్వతంత్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించట్లేదన్నారు. డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీనివలన రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, అందుకే దీనిపై కూడ కేంద్రం విచారణ జరపించాలని మంత్రి గోయల్ ను జీవీఎల్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ