తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాపరిషత్ చైర్ పర్సన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోనూ టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ టిఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పాత మరియు కొత్త నాయకులు సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. బీజేపీతో పోటీ అనే అపోహలను నాయకులు పెట్టుకోవద్దని, టిఆర్ఎస్ కు ఎవరితోనూ పోటీ లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. పార్టీ తరపున ఒకసారి అభ్యర్థిని ఖరారు చేశాక ఆ అభ్యర్థి గెలుపుకోసమే మిగిలిన నాయకులందరూ పని చేయాలని అన్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
[subscribe]