టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ రాష్ట్రప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోస్టన్ కమిటీకి అసలు తలాతోక ఉందా? అని ప్రశ్నించారు. బోస్టన్ కమిటీని ఎప్పుడు వేశారో కూడా చెప్పకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని విమర్శించారు. అమరావతిని తీసుకెళ్లి ఫెయిల్యూర్ సిటీలతో పోలుస్తారా? డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? బోస్టన్ కమిటీ రిపోర్ట్ కంటే టీడీపీ తయారుచేసిన విజన్ ఉత్తమంగా ఉందని చెప్పారు. విశ్వసనీయతలేని బీసీజీ గ్రూప్ నివేదికతో రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని ప్రశ్నించారు. రాజధాని రైతు మల్లికార్జునరావు గుండెపోటుతో చనిపోవడం బాధాకరమన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులు మనోవేదనతో బాధపడుతున్నారని చెప్పారు.
రాజధానికి లక్షా 10 వేల కోట్లు అవసరమని ఎవరు చెప్పారు? అసెంబ్లీ, సచివాలయం భవనాలు వైసీపీ వాళ్లకు కనిపించట్లేదా? అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అసత్యాలు చెబుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంగా ఉంటుందని, శివరామకృష్ణ నివేదిక మేరకే రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వం, రైతులు అగ్రిమెంట్ చేసుకుంటే గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ వితండ వాదానికి గట్టిగా బుద్ధి చెప్పేలా పోరాడాలని అన్నారు. జగన్ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, జీఎన్ రావు రిపోర్టు ప్రతులను సంక్రాంతి భోగి మంటల్లో తగలబెట్టమని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.
[subscribe]