పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టి. కాంగ్రెస్ నేతలు ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని రాజభవన్ లో కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్రంలోని పలు సమస్యలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించటం తెలిసిన విషయమే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన మరో ముఖ్యమైన, జీవో 111 ఎత్తివేస్తున్నట్లు కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే వీటిపై టి. కాంగ్రెస్ నేతలు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు. ఇప్పటికే వరి కొనుగోలు కేంద్రాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆలస్యం చేశాయని, కావున ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం కూడా కలిపి రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ చార్జీలు పెంచారని, దీని వలన సామాన్య ప్రజలపై కోట్ల రూపాయల భారం పడుతోందని గవర్నర్ తమిళిసై కు నేతలు ఫిర్యాదు చేశారు. ఇక జీవో 111 ఎత్తివేత విషయంలో అఖిలపక్షం వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్కు వారు ఒక వినతి పత్రం అందజేశారు. గవర్నర్ను కలిసిన వారిలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి, సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ