కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. శనివారం ఆయన దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించామని, ఇది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమేనని, ఇదే ఫైనల్ కాదని స్పష్టం చేశారు. రైతులు అపోహలు నమ్మి ఆందోళన చెందుతున్నారని, వారు భయపడాల్సిన పని లేదని ఆయన భరోసానిచ్చారు. ఇక రైతుల భూములు వారి పేరు మీదనే ఉంటాయని, భూమికి, భూ యజమానులకు ఎలాంటి నష్టం ఉండదని తేల్చిచెప్పారు. అలాగే అందరి అభ్యంతరాలు తీసుకుంటామని, ఏవైనా ఇబ్బందులు, అభ్యంతరాలు ఇస్తే రికార్డు చేస్తామని కలెక్టర్ పాటిల్ తెలియజేశారు.
గతంలో 2000వ సంవత్సరంలో కూడా పాత మాస్టర్ ప్లాన్ తయారైందని, వాటిలోని భూములను ఎవరూ కదిలించలేదని కలెక్టర్ గుర్తుచేశారు. అప్పుడు కూడా ఇలాంటి జోన్లు పెట్టారని, కానీ నాడు ఎవరూ దీనిపై ఆందోళన చెందలేదని, అయితే ఇప్పుడే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూముల సేకరణ కాదని, జోన్ కింద మార్క్ అయి ఉంటుందని ఆయన తెలిపారు. ఇక నూతన మాస్టర్ ప్లాన్పై ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయని, రైతులకు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే, జనవరి 11న సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలు చెప్పొచ్చని సూచించారు. వచ్చిన అభ్యంతరాలపై చర్చ ఉంటుందని, ఆ తర్వాత పై స్థాయిలో మాస్టర్ ప్లాన్ ఫైనల్ అవుతుందని కలెక్టర్ జితేష్ పాటిల్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE