ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మాజీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు గత నాలుగు రోజులుగా కాకినాడలో ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు తప్పని పరిస్థితుల్లో నిన్న రాత్రి ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో డీఐజీ పాలరాజు సమక్షంలో విచారించారు. విచారణలో అనంత బాబు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ హత్య తానే స్వయంగా చేసినట్లు అంగీకరించాడు.
దీంతో ముందుగా ఆయనకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అనంతబాబును జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతబాబు అరెస్ట్ అనంతరం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్బాబు మీడియాకు వెల్లడించారు. అనంతబాబుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం రూ. 25 వేలు ఇవాల్సి ఉండటంతో దీని విషయమై ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగిందన్నారు. ఈ గొడవలో అనంతబాబు కోపంతో సుబ్రహ్మణ్యాన్ని బలంగా వెనక్కి నెట్టడంతో అతని తలకు గ్రిల్ తగిలి గాయం కావడంతో మృతి చెందినట్లు తెలిసిందన్నారు. దీంతో ఎఫ్ఐఆర్ను ఐపిసి 174 (ప్రమాద మరణం) నుండి సెక్షన్ 302 (హత్య)గా మార్చామని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టామని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ