స్విట్జర్లాండ్లోని దావోస్లో మే 22 నుంచి మే 26వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు జరగుతుంది. ఈ డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, అధికారుల బృందం పాల్గొనగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అధికారుల బృందం పాల్గొంది. ఈ నేపథ్యంలో దావోస్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. ఈ అరుదైన కలయిక సందర్భంగా వారివురూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ భేటీపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్తో గొప్ప సమావేశం జరిగింది” అని పేర్కొన్నారు. అయితే ఈ భేటీ సందర్భంగా ఏ అంశాలపై చర్చించారనే విషయం తెలియాల్సి ఉంది.
మరోవైపు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి కేటీఆర్ మొదటి రోజున పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై చర్చించారు. ఈ సమావేశాల్లో భాగంగా ప్రముఖ బీమా సంస్థ స్విస్ రే, ఈకామర్స్ సంస్థ మీషో, స్పానిష్ ఫార్మా కంపెనీ కీమో మరియు లూలు గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి.
అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతూ, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ముందుగా ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్పై నిర్వహించిన సెషన్లో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. అనంతరం దావోస్ వేదికగా 2 మెగా ప్రాజెక్టులపై అదానీ గ్రీన్ ఎనర్జీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్, 10వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకోసం రాష్ట్రంలో అదానీ సంస్థ రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 10వేలమందికి ఉపాధి లభించనుంది. ఇందుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్, గౌతం అదానీల సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి.
అలాగే టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ గుర్నానితో సీఎం వైఎస్ జగన్ భేటీ అయి విశాఖలో కంపెనీ విస్తరణపై చర్చించారు. అనంతరం దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెశిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్తో సీఎం భేటీ అయ్యారు. ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీలో భాగస్వామ్యం కావాలని సీఎం కోరగా, సీఎం ప్రతిపాదనలపై సానుకులంగా స్పందించి త్వరలో ఏపీలో పర్యటిస్తామని ఫ్లోరెన్స్ వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఇథనాల్ తయారీకి రూ.250 కోట్లతో ప్లాంటు పెడతామని సబ్సిడరీ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ ప్రతిపాదించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF