భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్కుమార్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను సమీక్షించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సకాలంలో వరద సహాయాన్ని అందించినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ టీమ్లను తరలించారు. ఆ టీమ్ లను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో ఉంచినట్లయితే, వరద సహాయక చర్యలు సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.
మరోవైపు వరద నీరు 80 అడుగులకు చేరినా పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి, ప్రత్యేక పునరవాస శిబిరాలకు తరలించాలన్నారు. ఇప్పటికే భద్రాచలంలో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి చెందిన 5 బృందాలు, సింగరేణి రెస్క్యూ టీమ్లు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. వరదల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అలాగే ఆస్తినష్టం జరగకుండా కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని సహాయక శిబిరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను సీఎస్ ఆదేశించారు. ఈ రాత్రికి ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ ఐటీసీ భద్రాచలం వద్ద ఉంటుందని తెలిపారు. సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటుగా మరో నలుగురు సీనియర్ ఆర్డీవోలను నియమించారు. శుక్రవారం రాత్రికి 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, బోట్లు, బస్సులు, ట్రక్కులు కూడా భద్రాచలంకు తరలిస్తున్నట్లు సీఎస్ తెలిపారు.
సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులకు కూడా బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో సింగరేణి ఎండీ ఎన్.శ్రీదర్, అదనపు డీజీ జితేందర్, అదనపు డీజీ ఫైర్ సంజయ్ జైన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సిసిఎల్ఎ డైరెక్టర్ రజత్ కుమార్ సైనీ, పంచాయతీరాజ్ డైరెక్టర్ ఎం.హనుమతరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY